14 పాయింట్లతో అమెరికాకు తాజాగా ప్రతిపాదనలు పంపిన ఇరాన్

  • పాకిస్థాన్ ద్వారా ఈ ప్రతిపాదనలు పంపిన ఇరాన్
  • లెబనాన్‌లో కూడా యుద్ధానికి ముగింపు పలకాలన్న ఇరాన్
  • హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్
యుద్ధానికి ముగింపు పలకడానికి ఇరాన్ 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదనలను అమెరికాకు పంపించింది. పాకిస్థాన్ ద్వారా ఈ ప్రతిపాదనలను అమెరికాకు పంపించినట్లు ఇరాన్ జాతీయ మీడియా తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు అమెరికా 9 పాయింట్లను ప్రతిపాదించింది. ప్రతిగా, ఇరాన్ 14 పాయింట్లతో తాజా ప్రతిపాదనలు పంపించింది. యుద్ధాన్ని అన్ని విధాలుగా ముగించాలని తాజా ప్రతిపాదనల్లో స్పష్టం చేసింది.

లెబనాన్‌లో కూడా యుద్ధం ముగింపును ఇరాన్ కోరుకుంది. తమపై మళ్లీ దాడులు చేయవద్దని, సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవాలని, వివిధ దేశాల్లో స్తంభింప చేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని, ఇంధనం సహా వివిధ రూపాల్లో తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ఆ ప్రతిపాదనల్లో స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోవాలని పేర్కొంది.

యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ ఈ ప్రతిపాదనల్లో తెలిపింది. కాల్పుల విరమణ పొడిగింపు పేరుతో తాత్కాలిక సంధికి బదులు సమస్యను శాశ్వతంగా ముగించేలా సమగ్ర పరిష్కారాన్ని ఇరాన్ కోరింది. ముప్పై రోజుల్లో యుద్ధాన్ని ముగించాలని కోరింది.

యుద్ధానికి ముగింపు పలకాలా లేక కొనసాగించాలా అనే నిర్ణయం ఇప్పుడు అమెరికానే తీసుకోవాలని ఇరాన్ తెలిపింది. యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడమే తమ లక్ష్యమని పేర్కొంది. జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకోవడానికి తాము మాత్రం దేనికైనా సిద్ధంగానే ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసింది.

Iran
Iran US relations
Iran proposal
America
US
Middle East tensions
Hormuz Strait
Sanctions relief

More Telugu News